టీవీల ముందు, కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూచుంటున్నారా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దీర్ఘకాలం కూచునేవారికి పెద్దపేగులో బొడిపెలు (పాలిప్స్) తిరగబెట్టే అవకాశం ఎక్కువగా ఉంటోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నడక, పరుగు వంటి వ్యాయామాలు చేసినా ఇలాంటివారికి ఈ ముప్పు తప్పటం లేదనీ చెబుతున్నారు. సాధారణంగా పెద్దపేగు క్యాన్సర్ను గుర్తించేందుకు కొలనోస్కోపీ పరీక్ష చేసేటప్పుడు ఇలాంటివాటిని గుర్తిస్తుంటారు. ఆ సమయంలోనే వాటిని తొలగిస్తుంటారు కూడా. అయితే దీర్ఘకాలం కూచోవటం వల్ల ఇవి తిరిగి ఏర్పడే ప్రమాదం అధికమవుతున్నట్టు అమెరికా పరిశోధకులు గుర్తించారు. రోజుకి 7 గంటల కన్నా తక్కువసేపు కూచునేవారితో పోలిస్తే.. 11 గంటలు, అంతకన్నా ఎక్కువసేపు కూచునేవారికి ఈ ముప్పు 45% అధికంగా ఉంటున్నట్టు తేలింది. ఇది కేవలం పురుషుల్లోనే కనబడుతుండటం గమనార్హం. నిజానికి ఈ పాలిప్స్ క్యాన్సర్ రహితమే అయినప్పటికీ.. వీటితో మున్ముందు పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ముప్పూ పెరుగుతుంది. అందుకే ఇవి ఏర్పడకుండా చూసుకోవటం ఉత్తమం. ''రోజూ నిర్ణీత సమయం మేరకు వ్యాయామంచేసినా.. దీర్ఘకాలం కూచోవటం వల్ల ముందుగానే జబ్బుల బారినపడే అవకాశం పెరుగుతోంది'' అని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన క్రిస్త్టెన్ మోల్మెంటీ చెబుతున్నారు. అందువల్ల ప్రజారోగ్య సిఫారసుల్లో కూచోవటం తగ్గించాలనే అంశాన్నీ చేర్చాలని సూచిస్తున్నారు
- ===========================