- జన్యు ఉత్పరివర్తనంతో మహిళలో అరుదైన వ్యాధి 'విమ్ సిండ్రోమ్ నయం--
లండన్: వైద్య చరిత్రలోనే ఆశ్చర్యకరమైన అంశం ఇది. రోగ నిరోధక శక్తి క్షీణించి, నియంత్రణ లేకుండా కణతులు వచ్చే అరుదైన వ్యాధి ఉన్న ఒక మహిళలో అదృష్టవశాత్తూ జరిగిన డీఎన్ఏ ఉత్పరివర్తనం ఆ వ్యాధిని నయం చేసింది. దాదాపు 50 ఏళ్ల క్రితం ఒక మహిళ రోగ నిరోధక శక్తిలో లోపం వల్ల శరీరం మొత్తం కణతులు వ్యాపించాయి. ఈ వ్యాధిని 'విమ్ సిండ్రోమ్'గా వైద్యులు నిర్ధరించారు. డీఎన్ఏలోని ఒక భాగంలో లోపం వల్ల ఇది వస్తుంది. ప్రస్తుతం 58 ఏళ్ల వయసున్న సదరు మహిళ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్న తన ఇద్దరు కుమార్తెలను పరీక్షించాల్సిందిగా అమెరికాలోని 'నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్చువస్ డిసీజెస్' పరిశోధకులను ఇటీవల సంప్రదించింది. తన కణతులు 20 ఏళ్ల క్రితమే తగ్గిపోయాయని ఆమె తెలిపింది. దీంతో ఆమె డీఎన్ఏను పరీక్షించిన వైద్యులు అవాక్కయ్యారు. ఆమెకు 30 ఏళ్ల వయసులో ఎముక మజ్జలోని ఒక కణంలో జరిగిన డీఎన్ఏ ఉత్పరివర్తనం వల్ల వ్యాధి పూర్తిగా నయమైందని వైద్యులు తేల్చారు. ఉత్పరివర్తనంలో భాగంగా వ్యాధికారక జన్యువు తొలగిపోయిందని తెలిపారు.---09-Feb-2015
- ===========================