పది మంది లేదా అంతకన్నా ఎక్కువమంది పిల్లలను కన్న తల్లులకు కేన్సర్ వచ్చే ప్రమాదం చాలాతక్కువని ఫిన్లండ్ శాస్త్రవేత్తలు తేల్చారు. పరిశోధనలో భాగంగా.. ఫిన్లండ్కు చెందిన 5,000 మంది మహిళలపై వీరు అధ్యయనం నిర్వహించారు. ఈ మహిళలందరూ 2010కన్నా ముందు కనీసం పదిమంది పిల్లలకు జన్మనిచ్చిన వాళ్లే. వీరంతా లూథరిన్ చర్చికి చెందిన లీస్టడియన్ వర్గ సభ్యులు. వీరి దైనందినజీవితం సాధారణ మహిళల్లాగే ఉన్నప్పటికీ.. గర్భనిరోధక సాధనాలను ఉపయోగించటం వీరి మతంలో నిషిద్ధం. ఈ నేపథ్యంలోనే, వీరిలో పదిమంది సంతానాన్ని కలిగి ఉండటం సాధారణ విషయం. ఈ మతానికి చెందిన ఐదువేలమందిపై శాస్త్రవేత్తలు సర్వే జరిపినప్పుడు.. మూడుదశాబ్దాల వ్యవధిలో 656 మంది కేన్సర్ వ్యాధిని ఎదుర్కొన్నట్లు తేలింది. ఫిన్లండ్లో కేన్సర్ బాధిత స్త్రీలకు సంబంధించిన గణాంకాల ఆధారంగా చూస్తే.. 5,000 మందిలో సగటున 856 మంది కేన్సర్ బారిన పడుతున్నారు. అంటే, పదిమందికన్నా ఎక్కువమంది పిల్లలున్న తల్లుల విషయంలో ఈ సంఖ్య 200 తక్కువగా ఉందని తేలింది. అదే విధంగా కేన్సర్ వ్యాధిని కొత్తగా ఎదుర్కొంటున్న వాళ్లు కూడా ఈ మహిళల్లో తక్కువేనని, సాధారణం కంటే వీరి సంఖ్య 24 శాతం తక్కువగా ఉందని వెల్లడైంది. చిన్నవయసులో తల్లి కావటం వల్ల రొమ్ముకేన్సర్ నుంచి రక్షణ లభిస్తుందని ఇంతకుముందే పలు పరిశోధనల్లో రుజువైంది. కానీ, ఎక్కువమంది పిల్లలను కన్న తల్లులకు కూడా కేన్సర్ దూరంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది.
- ===========================
