
శిశువులకు తల్లిపాలు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి పిల్లలకు అవసరమైన పోషణ అందించటతో పాటు రోగనిరోధకశక్తిని పెంచి రకరకాల జబ్బుల బారినపడకుండానూ కాపాడతాయి. తల్లిపాలు చేసే మేలు గురించి ఇప్పుడు మరో కొత్త సంగతి బయటపడింది. ఇవి తల్లి నుంచి పిల్లలకు మంచి బ్యాక్టీరియానూ చేరవేస్తున్నట్టు వెల్లడైంది. తల్లిపాలలోని బ్యాక్టీరియా రకాలు.. తల్లీ శిశువుల మలంలోని బ్యాక్టీరియా రకాలు ఒకేరకంగా ఉంటున్నట్టు స్విట్జర్లాండ్ పరిశోధకులు గుర్తించారు. శిశువుల పేగుల్లో కీలకమైన పోషకాల సమతుల్యతకు ఈ బ్యాక్టీరియా దోహదం చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. పేగుల్లో తలెత్తే సమస్యలను నివారించటానికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని అనుకుంటున్నారు. ''తల్లి పేగుల్లోని బ్యాక్టీరియా తల్లిపాల నుంచి శిశువులకు చేరుకుంటున్నట్టు బయటపడటం చాలా ఆసక్తిని రేకెత్తించింది'' అని జ్యూరిచ్లోని ఇన్స్టిట్యూట్ ఫర్ ఫుడ్, న్యూట్రిషన్ అండ్ హెల్త్కు చెందిన క్రిస్టోఫ్ లాక్రాయిక్స్ అంటున్నారు. శిశువుల పేగుల ఆరోగ్యం, రోగనిరోధక వ్యవస్థ బాగుండటానికి తల్లి, పిల్లల పేగుల్లోని మంచి బ్యాక్టీరియా చాలా కీలకమని చెబుతున్నారు. అయితే ఈ బ్యాక్టీరియా పేగుల్లోంచి తల్లి పాలలోకి ఎలా చేరుతోందనేది మాత్రం బయటపడలేదు.
శిశువులను ఘనాహారానికి సన్నద్ధపరిచే తల్లిపాలు--తాజా అధ్యయనంలో వెల్లడి
వాషింగ్టన్: తల్లిపాల ద్వారా చిన్నారుల్లోకి ప్రవేశించే సూక్ష్మజీవులు వారికి మేలు చేస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. ఘనాహారం తీసుకునేందుకు వీలుగా వారిని మరింత త్వరగా సంసిద్ధులు చేసేందుకు ఈ సూక్ష్మజీవులు తోడ్పడతాయని పేర్కొంది. శిశువులు జన్మించిన తొలినాళ్లలో తీసుకునే తల్లిపాలు.. పేగుల్లో ఉండే సూక్ష్మజీవుల రకాల విభిన్నత, స్థిరత్వంపై ప్రభావం చూపుతాయని ఉత్తర కరోలినా విశ్వవిద్యాలయం చేపట్టిన పరిశోధన వెల్లడించింది. తల్లిపాల నుంచి ఘనాహారానికి శిశువులు మారే సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయంది. అదేవిధంగా దీర్ఘకాలంలోనూ వారి ఆరోగ్యపరిస్థితిపై ప్రభావం చూపుతాయని తెలిపింది------09/Feb/2015
- ===========================
Visit my website at ->
Dr.Seshagirirao.com/