టోక్యో: ప్రపంచంలోనే తొలిసారిగా మూలకణాలతో మానవ కాలేయ కణజాలాన్ని సృష్టించటంలో జపాన్ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. కాలేయ దాతల కొరతను అధిగమించటానికి ఇది దారితీయగలదని భావిస్తున్నారు. హ్యూమన్ ఇండ్యూస్డ్ ప్లూరీపోటెంట్ స్టెమ్సెల్స్ (హైపీఎస్సీ) నుంచి రక్తనాళాలతో కూడిన, పూర్తిస్థాయిలో పనిచేసే మానవ కాలేయాన్ని సృష్టించొచ్చని యోకోహామా సిటీ విశ్వవిద్యాలయానికి చెందిన టకనోరీ టకేబే, హిడేకి టనిగుచి నిరూపించారు. అవయవాల వైఫల్యంతో బాధపడేవారికి అవయవ బుడిపెలను (ప్రాథమిక దశలోని అవయవాలు) మార్పిడి చేయటం ప్రత్యామ్నాయ విధానంగా ఉపయోగపడగలదని విజయవంతంగా ప్రదర్శించారు. సాధారణంగా కాలేయం ఏర్పడే తొలిదశలో కాలేయం మూలకణాలు.. పేగుల పైభాగం నుంచి విడిపోయి కాలేయం ఆకారంలో బుడిపెగా రూపుదిద్దుకుంటాయి. అనంతరం ఇందులో రక్తనాళాలు పుట్టుకొస్తాయి. దీని ఆధారంగానే పరిశోధకులు హైపీఎస్సీలతో కాలేయాన్ని సృష్టించారు. హైపీఎస్సీ కాలేయ బుడిపెను మార్పిడి చేసిన 48 గంటల్లోనే రక్తనాళాలతో కూడిన కాలేయ బుడిపెగా మారటం గమనార్హం. (Eenadu 05/July/2013)
- ===========================
Visit my website at ->
Dr.Seshagirirao.com/