క్యాన్సర్లన్నింటిలోకీ పెద్దపేగు, మలాశయ క్యాన్సర్లను తేలికగా నివారించుకునే అవకాశముంది. ఇవి ముందుగా క్యాన్సర్ రహిత బుడిపెల (పాలిప్స్) రూపంలోనే మొదలవుతాయి. చివరికి క్యాన్సర్గా మారతాయి. ఇందుకు దాదాపు పదేళ్ల సమయం పడుతుంది. అందువల్ల 50 ఏళ్లు పైబడిన తర్వాత తరచుగా కొలనోస్కోపీ పరీక్ష చేయించుకోవటం మంచిదని వైద్యులు చెబుతుంటారు. ఒకవేళ బుడిపెలు కనబడితే వాటిని తొలగించటం ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా చూసుకోవచ్చు. వూబకాయులకు.. ముఖ్యంగా పురుషులకు కొలనోస్కోపీ పరీక్ష తప్పనిసరని మిషిగన్ స్టేట్ విశ్వవిద్యాలయ అధ్యయనం సూచిస్తోంది. ఎందుకంటే కొవ్వు హార్మోన్ అయిన లెప్టిన్ స్థాయులు, శరీర బరువు ఎత్తుల నిష్పత్తి, నడుము చుట్టుకొలత అధికంగా గల మగవారికి పెద్దపేగులో బుడిపెలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్టు బయపడింది మరి. ఫలితంగా వీరికి పెద్దపేగు, మలాశయ క్యాన్సర్లు వచ్చే ముప్పూ ఎక్కువే ఉంటోంది.
ప్రస్తుతం కొలనోస్కోపీ పరీక్ష చేసే విషయంలో వయసు, కుటుంబ చరిత్రను పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీనికి అధిక బరువునూ జోడించాల్సిన అవసరముందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అధ్యయనంలో భాగంగా కొందరు వూబకాయులకు కొలనోస్కోపీ పరీక్ష చేయగా.. 30% మందిలో ఒకటి కన్నా ఎక్కువ బుడిపెలు ఉంటున్నట్టు తేలిందని పరిశోధకులు చెబుతున్నారు. మరి కాస్త ఎక్కువ వూబకాయులకైతే మూడు బుడిపెలుండే అవకాశం 6.5 రెట్లు ఎక్కువగా ఉంటోందనీ వివరిస్తున్నారు. లెప్టిన్ మోతాదులు ఎక్కువగా ఉండటం మూలంగా పెద్దపేగులోని క్యాన్సర్ ముందస్తుదశ కణాలకు రక్తసరఫరా పెరిగి, అవి వృద్ధి చెందటానికి దోహదం చేస్తోందని పేర్కొంటున్నారు. వూబకాయుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ అధ్యయన ఫలితాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
- ===========================
Visit my website at ->
Dr.Seshagirirao.com/