ధ్యానం మానసిక ప్రశాంతతను చేకూరుస్తుందన్నది తెలిసిందే. ఇది శరీరంలో వాపుతో సంబంధం గల జన్యువుల వ్యక్తీకరణలో మార్పులనూ కలగజేస్తున్నట్టు తాజాగా తేలింది. అలాగే ఒత్తిడితో కూడిన ఘటనల నుంచి త్వరగా కోలుకునేట్టూ చేస్తున్నట్టు బయటపడింది. జన్యువులపై ధ్యానం ప్రభావాలను గుర్తించటానికి విస్కాన్సిన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం చేశారు. 40 మందిని ఎంచుకొని పరిశీలించారు. కొందరితో ఎనిమిది గంటల సేపు ధ్యానం చేయించగా.. కొందరిని డాక్యమెంటరీలు చూడమని, పుస్తకాలు చదవమని, కంప్యూటర్ గేమ్స్ ఆడుకోమని చెప్పారు. అనంతరం వీరి రక్తనమూనాలను పరీక్షించగా.. ధాన్యం చేసినవారిలో వాపుతో సంబంధం గల హెచ్డీఏసీ, ఆర్ఐపీకే2, కాక్స్2 జన్యువుల వ్యక్తీకరణలో తగ్గుదల కనిపించింది. పలు వ్యాధుల వృద్ధి, చికిత్సలో వాపు కీలక పాత్ర పోషిస్తున్నందున ఈ అధ్యయన ఫలితాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శరీరంలో దీర్ఘకాల వాపు మూలంగా గుండెజబ్బు, కీళ్లవాతం, ఆస్థమా, ల్యూపస్, పెద్దపేగు పూత, క్యాన్సర్ వంటి జబ్బుల ముప్పు పొంచి ఉంటోందని గత అధ్యయనాల్లో వెల్లడైంది. నొప్పిని, వాపును తగ్గించటానికి ప్రస్తుతం వాడుతున్న మందులు కొన్ని జన్యువులను లక్ష్యంగా చేసుకొనే పనిచేస్తుంటాయి. ధ్యానం మూలంగా ఈ జన్యువుల్లోనే మార్పులు కనబడటం విశేషమని అధ్యయన నేత పెర్లా క్యాలిమన్ చెబుతున్నారు. అంతేకాదు.. ఒత్తిడికి లోనైన తర్వాత ఆర్ఐపీ2, హెచ్డీఏసీ జన్యువులు త్వరగా సాధారణ స్థాయికి రావటమూ గమనార్హం. శరీరంలో వాపు మూలంగా కణాలు త్వరగా వృద్ధాప్యానికీ లోనవుతాయి. రకరకాల దీర్ఘకాల సమస్యలకూ దారితీస్తాయి. అందువల్ల ధ్యానం వంటి పద్ధతులు ఆయుష్షును పెంచటానికీ తోడ్పడతాయని పరిశోధకులు వివరిస్తున్నారు
- ===========================
