
ఛాతీలో మంటను తగ్గించే మందులను దీర్ఘకాలం పాటు వాడితే విటమిన్ బి12 లోపం ముప్పు పొంచి ఉంటున్నట్టు తాజాగా బయటపడింది. ఈ విషయాన్ని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే రక్తహీనతకు దారి తీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. నాడులు దెబ్బతినటం, మతిమరుపు సైతం రావొచ్చని చెబుతున్నారు. ఛాతీ మంటను తగ్గించే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటార్స్ (ఒమిప్రెజోల్ వంటివి) మందులను రెండు సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువకాలం వాడినవారికి విటమిన్ బి12 లోపం 65% ఎక్కువగా ఉంటున్నట్టు అమెరికా పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా రోజుకి ఒకటిన్నర మాత్రలు వేసుకునేవారికి ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక హిస్టమిన్ 2 రిసెప్టర్ యాంటగోనిస్ట్స్ (సిమెటిడిన్, రాంటిడిన్ వంటివి) మందులు వాడేవారికి బి12 లోపం ముప్పు 25% అధికమవుతున్నట్టు తేలింది. అందువల్ల ఈ మందులను తప్పకుండా వేసుకోవాల్సినవారికి తక్కువ మోతాదులో ఇవ్వటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ విషయంలో విటమిన్ బి12 లోపంతో తలెత్తే సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు. జీర్ణాశయంలోని ఆమ్లం పైకి ఎగదన్నుకొని, అన్నవాహికలోకి రావటం వల్ల ఛాతీ మంట వస్తుంది. మసాలాలు, కారం, తదితర ఆహార పదార్థాలు.. మద్యం, కొన్నిరకాల మందులు, గర్భం ధరించటం వంటివి ఈ సమస్యను తెచ్చిపెట్టొచ్చు.
- ===========================
Visit my website at ->
Dr.Seshagirirao.com/