చిరునవ్వుకు తెల్లగా మెరిసే దంతాలు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి కదా. అంతేకాదు. ఇవి జ్ఞాపకశక్తిని కాపాడటానికీ తోడ్పడతాయని పరిశోధకులు చెబుతున్నారు. దంతాల, చిగుళ్ల శుభ్రతకూ అల్జీమర్స్ జబ్బుకూ సంబంధం ఉంటోందని తేలటమే దీనికి నిదర్శనం. తీవ్ర మతిమరుపు (డిమెన్షియా) బారినపడ్డవారు చనిపోయిన తర్వాత వారి మెదడు కణజాలంపై పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం చేశారు. డిమెన్షియా బాధితుల మెదళ్లలో పి.జింజివలిస్ బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉన్నట్టు ఇందులో తేలటం గమనార్హం. తీవ్ర చిగుళ్లవాపు జబ్బుకు దోహదం చేసే పి.జింజివలిస్ బ్యాక్టీరియా.. మనం భోజనం చేసినప్పుడో, పళ్లు తోముకుంటున్నప్పుడో రక్త ప్రవాహంలో కలుస్తుంది. అక్కడ్నుంచి అది మెదడుకు చేరుకుంటున్నట్టు పరిశోధకులు అనుమానిస్తున్నారు. ఈ బ్యాక్టీరియా మెదడుకు చేరుకున్న ప్రతీసారీ అక్కడ రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తోందని భావిస్తున్నారు. దీంతో మెదడు కణాల నుంచి విడుదలయ్యే రసాయనాలు బ్యాక్టీరియా మీదనే కాదు.. నాడీ కణాలు మీదా దాడిచేసి వాటిని దెబ్బతీస్తాయన్నమాట. ఇది చివరికి డిమెన్షియాకు దారితీస్తుంది.
source : Medical Trends and updates magazine
- ===========================
