జెనీవా: శరీర ఉష్ణోగ్రత, ఆమ్ల స్థాయులతో పాటు రక్తంలో గ్లూకోజు, కొలెస్ట్రాల్ స్థాయులను పసిగట్టే బయోసెన్సర్ చిప్ను స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు రూపొందించారు. కేవలం చదరపు సెంటీమీటరు పొడవుండే దీన్ని చర్మం కింద అమర్చితే చాలు. ఎప్పటికప్పుడు గ్లూకోజు, కొలెస్ట్రాల్ వంటి వాటి స్థాయులను గుర్తించి.. బ్లూటూత్ ద్వారా ఆ సమాచారాన్ని మొబైల్ ఫోన్కు చేరవేస్తుంది. ఇది రక్తంలో మందుల ఉనికినీ పసిగడుతుండటం గమనార్హం. ఇందులో ఆరు సెన్సర్లతో కూడిన సర్క్యూట్, సంకేతాలను విశ్లేషించే విభాగం, రేడియో ట్రాన్స్మిషన్ మాడ్యూల్ ఉంటాయి. చర్మం మీద అతికించే పట్టీలో ఉండే బ్యాటరీ నుంచి శక్తిని తీసుకోవటానికి ఇందులో ఒక ఇండక్షన్ కాయిల్ కూడా ఉంటుంది. ఎలుకలపై పరీక్షించి చూడగా.. ఇది గ్లూకోజు స్థాయులను నిరంతరం పర్యవేక్షించినట్టు తేలింది. ఫలితాలు కచ్చితంగా ఉండటంతో దీన్ని 3-5 ఏళ్లలో మనుషులపై పరీక్షించే అవకాశముందని పరిశోధకులు తెలిపారు.
- ===========================
