లండన్: రక్తనాళాలను సృష్టించే ఒక జన్యువును శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల క్యాన్సర్, గుండెజబ్బులు, పక్షవాతానికి సమర్థవంతమైన చికిత్సను అందించవచ్చని భావిస్తున్నారు. లీడ్స్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ పరిశోధన జరిపారు. 'పీజోల్' అనే జన్యువు రక్తనాళాల ఏర్పాటులో కీలకపాత్ర పోషించే శరీరంలోని సెన్సర్లకు ఆదేశాలు జారీ చేస్తుందని వీరి పరిశీలనలో తేలింది. ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ డేవిడ్ బీచ్ మాట్లాడుతూ.. శరీరంలోని రక్తనాళాల వ్యవస్థ అనేది ముందుగానే ఏర్పాటయ్యేది కాదు. రక్తప్రవాహాన్ని బట్టి ఎప్పటికప్పుడు ఈ వ్యవస్థ రూపొందుతుంది. ఈ క్రమంలో పీజోల్ జన్యువు అత్యంత కీలకం. రక్తప్రవాహానికి అనుగుణంగా రక్తనాళాలను ఏర్పాటుచేసే ప్రోటీన్కు పీజోల్ నుంచే ఆదేశాలు వెళ్తాయి'' అని తెలిపారు. ఈ పరిశోధన నేపథ్యంలో.. క్యాన్సర్ బాధితుల్లో పీజోల్ జన్యువును నియంత్రించటం ద్వారా క్యాన్సర్ కణాలకు రక్తసరఫరా జరగకుండా చూడవచ్చని, తద్వారా ఆ కణాలను నిర్మూలించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రక్తసరఫరాలో తలెత్తే అడ్డంకుల వల్ల సంభవించే గుండెజబ్బుల వంటి ఇతర వ్యాధులను కూడా కొత్తకోణంలో అర్థం చేసుకొని, నూతన చికిత్సలను అభివృద్ధి చేయటానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
- ===========================
No comments:
Post a Comment
Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.