తీవ్ర మతిమరుపు, తికమక పడటం, ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో తెలుసుకోలేకపోవటం.. ఇలాంటి లక్షణాలతోనే మొదలవుతుంది అల్జీమర్స్ వ్యాధి. ఇది వృద్ధాప్యంలో వచ్చేదే అయినా దీని బీజాలు మాత్రం చాలా ముందుగానే పడతాయి. అల్జీమర్స్కు వయసు, జన్యుపరమైన అంశాలు దోహదం చేస్తాయి. కానీ అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం కూడా దీని ముప్పును పెంచుతాయని పరిశోధకులు భావిస్తున్నారు. మధుమేహం మూలంగా అల్జీమర్స్ రావొచ్చని గత అధ్యయనాల్లోనూ తేలింది. అయితే మధుమేహం స్థాయిలో కాకపోయినా రక్తంలో గ్లూకోజు మోతాదు అధికంగా ఉండేవారికీ అల్జీమర్స్ ముప్పు పొంచి ఉంటున్నట్టు తాజాగా బయటపడింది. అరిజోనా విశ్వవిద్యాలయం పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం చేశారు. మధుమేహం బారినపడని, గతంలో అల్జీమర్స్ బాధితుల కుటుంబాలకు చెందిన వారిని ఎంచుకొని పరీక్షించారు. వీరి మెదళ్లను స్కాన్ చేసి జీవక్రియ చర్య తీరుతెన్నులను పరిశీలించారు. సాధారణంగా అల్జీమర్స్ బాధితుల మెదళ్లలోని కొన్ని భాగాల్లో జీవక్రియ చర్య తగ్గిపోతుంటుంది. గ్లూకోజు మోతాదు ఎక్కువగా గలవారిలోనూ ఇలాంటి మార్పే కనబడినట్టు పరిశోధకులు గుర్తించారు. కాబట్టి మధుమేహం బారినపడకుండా జీవనశైలి మార్పులు చేసుకుంటే అల్జీమర్స్నూ దూరంగా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
- ===========================
No comments:
Post a Comment
Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.